Srimad Bhagavad Gita Chapter 1.2 Arjuna Vishada Yoga (Verses 14-30) | శ్రీమద్భగవద్గీత – అర్జున విషాద యోగము (శ్లోకాలు 14-30)

అథ ప్రథమోఽధ్యాయః

అర్జున విషాద యోగః

శ్లో || తతః శ్వేతై ర్హయై ర్యుక్తే మహతి స్యందనే స్థితౌ |

మాధవః పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదధ్మతుః || 14

తా || అప్పుడు తెల్లటి గుర్రాలు పూన్చిన గొప్పరథంలో కూర్చున్న మాధవుడూ, అర్జునుడూ దివ్యశంఖాలను ఊదారు.

శ్లో || పాంచజన్యం హృషీకేశః దేవదత్తం ధనంజయః |

పౌండ్రం దధ్మౌ మహాశంఖం భీమకర్మా వృకోదరః || 15

తా || పాంచజన్యాన్ని హృషీకేశుడూ, దేవదత్తాన్ని ధనంజయుడూ, పౌండ్రమనే మహాశంఖాన్ని భీమకర్ముడైన వృకోదరుడూ ఊదారు.

శ్లో || అనంతవిజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః |

నకుల స్సహదేవశ్చ సుఘోష మణిపుష్పకౌ || 16

తా || కుంతీపుత్రుడు ధర్మరాజు అనంతవిజయాన్నీ, సుఘోష మణిపుష్పకాలనే వాటిని నకుల
సహదేవులు ఊదారు.

శ్లో || కాశ్యశ్చ పరమేష్వాసః శిఖండీ చ మహారథః |

ధృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకి శ్చాపరాజితః || 17

తా || ఓ రాజా! గోప్పధనువు కలిగిన కాశీరాజూ, మహారథుడైన శిఖండీ, ధృష్టద్యుమ్నుడూ, విరాటుడూ, అపరాజితుడైన సాత్యకీ-

శ్లో || ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే |

సౌభద్రశ్చ మహాబాహుః శంఖాన్ దధ్ముః పృథక్ పృథక్ || 18

తా || ద్రుపదుడూ, ద్రౌపది కుమారులు, మహాబాహుడైన అభిమన్యుడూ వేరువేరుగా శంఖాలను ఊదారు.

శ్లో || సఘోషో ధార్తరాష్ట్రాణాం హృదయాని వ్యదారయత్ |

నభశ్చ పృథివీం చైవ తుములో వ్యనునాదయన్ || 19

తా || ఆ ధ్వని భూమ్యాకాశాలలో మారు మ్రోగి ధార్తరాష్ట్రుల హృదయాలను చీల్చింది.

శ్లో || అథ వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్త రాష్ట్రాన్ కపిధ్వజః |

ప్రవృత్తే శస్త్రసంపాతే ధనురుద్యమ్య పాండవః || 20

శ్లో || హృషీకేశం తదా వాక్యం ఇద మాహ మహీపతే |

తా || రాజా! అప్పుడు యుద్ధానికి సిద్ధమై నిలబడి వున్న కౌరవులను చూచి కపిధ్వజుడైన అర్జునుడు బాణాలు
వదలడానికి ధనువు నెత్తి, హృషీకేశునితో ఈ విధంగా అన్నాడు.

అర్జునఉవాచ :

శ్లో || సేనయో రుభయోర్మధ్యే రథం స్థాపయ మేఽచ్యుత || 21

శ్లో || యావదేతా న్నిరీక్షేఽహం యోద్ధుకామా నవస్థితాన్ |

కైర్మయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణసముద్యమే || 22

అర్జునుడన్నాడు:

తా || అచ్యుతా! యుద్ధం చేయగోరి నిలబడి ఉన్న వీరిలో నేను ఎవరెవరితో యుద్ధం చేయవలసి వుంటుందో వాళ్ళందరినీ చూడాలి. యుద్ధం చేయగోరి నిలుచున్న వీరినందరినీ చూడడానికి వీలుగా రెండు సేనలకి మధ్య నా రథాన్ని నిలబెట్టు.

శ్లో || యోత్స్యమానాన వేక్షేఽహం య ఏతేఽత్ర సమాగతాః |

ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేః యుద్ధే ప్రియచికీర్షవః || 23

తా || దుర్బుద్ధి అయిన దుర్యోధనుడికి ప్రియం చేయగోరి యుద్ధం కోసం ఎవరెవరు ఇక్కడ సమావేశామైనారో వాళ్ళని నేను చూస్తాను.

సంజయ ఉవాచ:

శ్లో || ఏవముక్తో హృషీకేశః గుడాకేశేన భారత! |

సేనయో రుభయో ర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమమ్ || 24

సంజయుడు అన్నాడు :
తా || ఇలా అర్జునుడి చేత అడగబడిన శ్రీకృష్ణుడు ఉభయ సేనల మధ్య ఉత్తమ రథాన్ని నిలబెట్టి,

శ్లో || భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితామ్ |

ఉవాచ పార్థ! పశ్యైతాన్ సమవేతాన్ కురూనితి || 25

తా || భీష్మ ద్రోణులకి మరియు రాజులందరికి ఎదురుగా (రథం నిలిపి) “పార్థా! సమావేశమై యున్న ఈ
కురువుల్ని చూడు” అన్నాడు.

శ్లో || తత్రాపశ్యత్ స్థితాన్ పార్థః పితౄనథ పితామహాన్ |

ఆచార్యాన్ మాతులాన్ భ్రాతౄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీన్ స్తథా || 26

తా || అప్పుడు అర్జునుడు తండ్రులని, తాతలని, గురువుల్ని, మేనమామల్ని, అన్నదమ్ముల్ని, కుమారులని, మనుమలని చూచాడు

శ్లో || శ్వశురాన్ సుహృదశ్చైవ సేనయో రుభయో రపి |

తాన్ సమీక్ష్య స కౌంతేయః సర్వాన్ బంధూ నవస్థితాన్ || 27

తా || ఇంకా అర్జునుడు, మామలనీ, సజ్జనులనీ, రెండు సేనలలోను నిలబడి వున్న యావన్మందీ బంధువుల్ని సమీక్షించి,

శ్లో || కృపయా పరయాఽఽవిష్టః విషీదన్నిద మబ్రవీత్ |

అర్జునఉవాచ:

శ్లో || దృష్ట్వేమం స్వజనం కృష్ణ! యుయుత్సుం సముపస్థితమ్ || 28

అర్జునుడు అన్నాడు :

తా || మిక్కుటమైన కరుణ ఆవహించగా విషాదంతో అర్జునుడు ఇలా అన్నాడు కృష్ణా! యుద్ధం చేయగోరి సమావేశమై వున్న నా ఈ బంధువులను చూడగా;

శ్లో || సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి |

వేపథుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే || 29

తా || నా అవయవాలు శిథిలమౌతున్నాయి. నోరు ఎండిపోతోంది. నా శరీరం వణుకుతోంది. రోమాలు
నిక్కబొడుచుకొంటున్నాయి.

శ్లో || గాండీవం స్రంసతే హస్తాత్ త్వక్చైవ పరిదహ్యతే |

న చ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః || 30

తా || గాండీవం చేతిలోంచి జారిపోతోంది. ఒళ్ళు మండుతోంది. నిల్చోడానికి ఓపిక లేకుండా వున్నది. మనస్సు భ్రమిస్తోంది.